కొవిడ్‌ పోరులో వైద్యుల తెగువ అభినందనీయం

బంజారాహిల్స్‌(ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు చూపిన తెగువ అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఐఎస్‌ఎం ఎడ్యుటెక్‌ సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ ద్వారా వివిధ దేశాల్లో మెడిసిన్‌ అభ్యసించిన 50మంది డాక్టర్లు ఇటీవల కొవిడ్‌ సమయంలో తెలంగాణలోని వివిధ వైద్యశాలల్లో చేసిన కృషిని గుర్తించిన ఐఎస్‌ఎం ఎడ్యుటెక్‌ సంస్థ 50మంది డాక్టర్లను సత్కరించి ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌  మాట్లాడుతూ ఇంట్లోంచి బయటకు వస్తేనే ప్రాణాలు పోతాయనే భయం ఉన్న సమయంలో వైద్యులు ధైర్యంగా రోగులకు సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్‌పీ.పట్నాయక్‌, ఐఎస్‌ఎం ఎడ్యుటెక్‌ సంస్థ అధినేత డా.ఫణిభూషణ్‌ పాల్గొన్నారు.