ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

 

ముగ్గరు పేషెంట్లు సహా డాక్టర్ మృతి!

న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ముగ్గురు పేషెంట్లతో సహా ఓ డాక్టర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా నగరంలోని ఓ ఆసుపత్రి మొదటి అంతస్తులో ఆకస్మికంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించారు. అనంతరం దీనిపై స్పందించిన అధికారులు.. ప్రమాదంలో ఇంటెన్సివ్ కేర్‌లో కొవిడ్ చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లతోపాటు ఆ వార్డులోని డాక్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది పేషెంట్లను హుటాహుటిన ఇతర ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అంతేకాకుండా.. ఆసుపత్రిలో మంటలు చెలరేగడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. ఈ విషయం దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలిపారు.