గడిచిన 24 గంటల్లో 72,330 కేసులు, 459 మరణాలు
న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి):దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 72,330 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 459 మరణాలు సంభవించాయి. 40,382 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండో దశలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కరోనా కేసుల నమోదుకు సంబంధించి దాదాపు ఆరు నెలల్లో దేశంలో ఇదే అతిపెద్ద నమోదు అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 10 న దాదాపు 74,000 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్-19వ్యాప్తికలవరం పుట్టిస్తోంది. కేసుల నమోదులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్ ఛత్తీస్గడ్ ముందు వరుసలో ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 22 లక్షల 21 వేల 665కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 62 వేల 927 గా ఉంది.