పైసా ఖర్చు లేకుండా..వైద్య పరిక్షలు

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

·         రేపు ఆదిలాబాద్ లో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ప్రారంభం

·         ఆధునిక పరికరాలతో 57 రకాల పరీక్షలు ఉచితం

·         త్వరలో అందుబాటులోకి సీటీస్కాన్‌, అల్ట్రాసౌండ్‌ సేవలు

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నది. రోగనిర్ధారణ పేద రోగులకు భారంగా మారింది. ఈ క్రమంలో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఇకపై పూర్తిగా ఉచితంగా చేయనున్నది. జిల్లా కేంద్రం దవాఖానల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ (టీ-హబ్‌)లను ఏర్పాటు చేసింది. కొన్ని రోజులుగా డయాగ్నోస్టిక్‌ హబ్‌ సిబ్బంది రోగనిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వాన్ని పరిశీలించేందుకు పరీక్షలు (డ్రైరన్‌) నిర్వహిస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్ష ఫలితాలు పరిశీలించిన వైద్యాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ ఎం హెచ్ ఓ డాక్టర్ సాధనను నోడల్ అధికారిగా నియమించారు.



57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు
రోగనిర్ధారణ కోసం కార్పొరేట్‌ దవాఖానల్లో చేసే పరీక్షలను డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా పూర్తిగా ఉచితంగా ప్రభు త్వం రోగులకు అందజేయనున్నది. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్‌ హబ్‌లో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. రూ.2 కోట్లతో డయాగ్నోస్టిక్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. బయోకెమిస్టు విభాగంలో 35 రకాల పరీక్షలు చేస్తారు. మధుమేహం (డయాబెటిక్‌) నిర్ధారణ కోసం ఎఫ్‌బీఎస్‌(ఫాస్టింగ్‌ బ్లడ్‌షుగర్‌), పీఎల్‌బీఎస్‌ (పోస్టు బ్లడ్‌షుగర్‌), ఆర్‌బీఎస్‌ (ర్యాండమ్‌ బ్లడ్‌షుగర్‌), గ్లూకోజ్‌ టాలరెన్స్‌ తదితర పరీక్షలు చేస్తారు. థైరాయిడ్‌ ప్రొఫైల్‌లో టీ 3 టోటల్‌, టీ 4 టోటల్‌, థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ పరీక్షలు చేయనున్నారు. లివర్‌ ఫంక్షన్‌ టెస్టులో పది రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. రీనల్‌ ఫంక్షనల్‌ టెస్టు( రెండు రకాలు), లిపిడ్‌ ప్రొఫైల్‌(ఏడు రకాలు) పరీక్షలు చేస్తారు. సీరం ఎల్రక్టోలైట్‌ పరీక్షల్లో సీరం సోడియం, సీరం పొటాషియం, సీరం క్లోరైడ్‌తో సహా మరో నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. పాథాలజీ విభాగంలో కంప్లీట్‌ బ్లడ్‌ పిక్షర్‌ పరీక్షల్లో 14 రకాల పరీక్షలు చేస్తారు. మైక్రో బయాలజీలో చికెన్‌ గున్యా, డెంగీతో పాటు మరో ఆరు రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఆటోమేటిక్‌ క్లినికల్‌ కెమిస్ట్రీ అనలైజర్‌, ఆటోమేటిక్‌ బయోకెమిస్ట్రీ అనలైజర్‌, ఇమ్యునోఅస్సె అనలైజర్‌, హెమటాలజీ అనలైజర్‌, ఎల్రక్టోలైట్‌ అనలైజర్‌, ఆటోమేటిక్‌ యూరిన్‌ అనలైజర్‌ తదితర యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, మేనేజర్‌, ఏడుగురు ల్యాబ్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఏర్పాటు చేశారు. రోగి తన రక్తనమూనా, వ్యక్తిగత వివరాలు, సెల్‌నెంబర్‌ ఇవ్వగానే పరీక్షలు చేసి రిపోర్టులను రోగి సెల్‌ఫోన్‌కు పంపుతారు. పీహెచ్‌సీల నుంచి రక్త నమూనాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17 నుంచి డయాగ్నోస్టిక్‌ హబ్‌లో డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీల నుంచి రోగులకు సంబంధించిన రక్తనమూనాలను తీసుకువచ్చి ఇక్కడి డయాగ్నోస్టిక్‌ హబ్‌లో పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు అందజేస్తారు. రోగనిర్ధారణతో వైద్యులు రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతున్నది.



ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు చెల్లుచీటీ
కరోనా వ్యాప్తి చెందుతున్నందున ర్యాపిడ్‌, ఆర్టిపీసీఆర్‌ టెస్టుల్లో కొవిడ్‌ సోకినట్లు దాఖలాలు లేకపోవడంతో రోగులు గత్యంతరం లేక సీటీస్కాన్‌ కోసం ప్రైవేట్‌ డయా గ్నొస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇదే అదనుగా దందాకు తెరలేపిన ప్రైవేట్‌ డయా గ్నొస్టిక్‌ సెంటర్లు టెస్టుల కోసం వచ్చిన వారి నుంచి రూ. 4నుంచి 6వేల వరకూ వసూలు చేసేవారు. చివరకు ప్రభుత్వమే కల్పించుకుని సీటీస్కాన్‌ ధరలను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్ల వల్ల పేద రోగులు ఎవరూ ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.



అత్యాధునిక పరికరాలు
రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. థైరాయిడ్‌ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన మిషన్‌లో ఒకేసారి 60 శాంపిల్స్‌ పరీక్షలు చేయనున్నారు. అలాగే సీబీపీ(కంప్లీట్‌బ్లెడ్‌పిక్చర్‌) రక్తకణాల గుర్తింపు మిషన్‌లో ఒకేసారి 120 శాంపిల్స్‌ పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. బయోకెమిస్ట్రీ పరికరంలో ఒకేసారి 400 శాంపిల్స్‌ పరీక్ష చేయడానికి అవకాశం ఉంది. ల్యాబ్‌లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది పని చేస్తున్నారు. డిజిటల్‌ ఎక్స్‌రే అందుబాటులోకి తెవడంతో 57 పరీక్షలు ఇక్కడే చేయనున్నారు.




అవకాశాన్ని వినియోగించుకోవాలి

-      నోడల్ అధికారి డిప్యూటీ డి ఎం అండ్ ఎం హెచ్ ఓ డాక్టర్ సాధన

 

ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ ఎం హెచ్ ఓ డాక్టర్ సాధనను నోడల్ అధికారిగా నియమించారు. బుధవారం నాడు ప్రారంభం కానున్న ల్యాబ్ ను ఆమె మంగళవారం రోజు పరిశీలించారు. ఏ విధంగా చేస్తారు రోజుకు ఎన్ని టెస్ట్ చేయవచ్చు రిపోర్టు ఏ విధంగా ఇస్తారు. అన్న విషయాన్ని ఆమె ఆరోగ్య జ్యోతి తో తెలియజేశారు. ల్యాబ్ లో 57 రకాల పరీక్షలను చేయవచ్చన్నారు .కానీ ప్రస్తుతం 42 పరీక్షలు చేయడానికి అందుబాటులో మిషన్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో 42 టెస్ట్ మాత్రమే చేయడం జరుగుతుందని సుమారు దీని విలువ ప్రైవేట్ లో 5 వేల నుంచి ఆరువేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన రోగి శాంపిల్స్ను పీహెచ్సీలో తీసుకొని వాహనాల ద్వారా ఇక్కడికి పంపించడం జరుగుతుందని ఇక్కడ టెస్ట్ చేసిన అనంతరం రోగికి లేదా  బంధువులకు కాని కాని మెసేజ్ పంపించడం జరుగుతుంది అన్నారు. లేని పక్షంలో వైద్య అధికారి కి నేరుగా రిపోర్టు వెళ్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.